కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ మాదాపూర్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. జాగ్రత్తగా మెలగాలని వారికి సీఎం రేవంత్రెడ్డి హితవు పలికారు.
ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం 4.00 గంటల నుంచి 6.00 గంటల వరకు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు సమయం కేటాయించాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. బీసీ జనగణన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్డు ఆధారంగానే ఆ ఫ్యామిలీకి సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొట్టే విధంగా సన్నద్దంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సీఎల్పీ సమావేశంలో పీసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బి. మహేశ్ కుమార్ గౌడ్ను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, కడియం శ్రీహరి, దానం నాగేందర్, ప్రకాశ్ గౌడ్ తదితరులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.