తండ్రి కాళ్లు మొక్కి ఆశీర్వాదం పొందిన కవిత
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ వచ్చిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ని గురువారం కలిశారు. హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయల్దేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌస్కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు.
ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్.. కవితను చూసిన వెంటనే ఆమెను గుండెలకు హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు.
ఉత్సాహంలో కేసీఆర్..
ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపాలవ్వడం, మరోవైపు కవిత అరెస్ట్, ఇంకోవైపు లోక్ సభ ఎన్నికల్లో సున్నా సీట్లకు పరిమితం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. అయితే చాన్నాళ్ల తరువాత కేసీఆర్ ముఖంలో ఇవాళ ఉత్సాహం, సంతోషం కనిపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కవితను అక్రమంగా నిర్బంధించారని చివరికి సత్యమే గెలిచిందని చెబుతున్నారు. కవిత రాకతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం కోలాహలంగా మారింది.









