రానున్న ఐదురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి మంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల కలిగే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, స్థానిక పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత అధికారులతో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా, ధరణి దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్, తదితర అంశాలపై ప్రత్యేకశ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతు కే.జెండగే పాల్గొన్నారు.









