నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనకు రాష్ట్ర సహాయ మంత్రి హోదా కల్పిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డిని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన క్యాబినెట్ లో వ్యవసాయ మంత్రిగా నియమించారు.
2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభాపతిగా పోచారం శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావడంతో పోచారం శ్రీనివాసరెడ్డి.. అన్ని రకాల అవకాశాలు కల్పించిన బీఆర్ఎస్ పార్టీని కాదని పదవుల కోసం హస్తం పార్టీలో చేరారు. తాజాగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పదవి దక్కింది.









