AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం.. రుణమాఫీ దేశంలోనే చరిత్రాత్మకం

– మాది గాంధీ సిద్ధాంతం.. మా వాదం గాంధేయవాదం
– గత పదేళ్లు హరించిన స్వేచ్ఛను తిరిగి పొందాం..
– ప్రతీ రైతు కూలీకి ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం
– నిరుద్యోగులకు పెద్దన్నలా అండగా ఉంటా..
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
– గొల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం స్వాతంత్య్రమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్‌ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను సీఎం తిలకించారు. అనంతరం ప్రసంగిస్తూ.. తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైనా రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉందని సీఎం రేవంత్‌ అన్నారు. ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ…‘ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశామని, తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికామని వ్యాఖ్యానించారు.

నెహ్రూ దూరదృష్టి వల్లే..

అహింసనే ఆయుధంగా మలిచిన మహా సంగ్రామం స్వాతంత్య్ర పోరాటమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దూరదృష్టి కారణంగా ప్రస్తుతం దేశం ఈ స్థాయిలో ఉందన్నారు. ముఖ్యంగా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టుల వల్లే దేశం సస్యశ్యామలంగా మారిందన్నారు. బీహెచ్‌ఈఎల్‌తోపాటు కీలకమైన ప్రాజెక్టుకులను స్థాపించారని గుర్తు చేశారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరా గాంధీ హయాంలో సాగులో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు.

ప్రభుత్వం ప్రజల పక్షమే..
బ్రిటీష్‌ దాస్య శృంఖలాల నుంచి దేశం విముక్తి పొందిన స్ఫూర్తితో తెలంగాణలో 2023 డిసెంబర్‌ 3న స్వేచ్ఛ పొందిందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం కొలువైంద న్నారు. పదేళ్లలో రాష్ట్రం కోల్పోయిన సేచ్ఛను తిరిగి తెచ్చామన్నారు. భౌతిక సంకెళ్లతో పాటు మానసిక బానిసత్వాన్ని కూడా తెంచేశామని చెప్పారు.

గుణాత్మకమైన మార్పు వస్తేనే..
అభివృద్ధి అంటే రంగుల గోడలు, అద్దాల మేడలు కాదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరగాలన్నారు. తెలంగాణ బ్రాండ్‌ను విశ్వ వేదికపై సగర్వంగా నిలవాలని ఆకాంక్షించారు. సరికొత్త నైపుణ్యాలు, ఉపాధి గ్యారంటీ కోసం స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

గత బీఆర్‌ఎస్‌ పాలనలో మోయలేని భారం..
పనిలోపనిగా గత బీఆర్‌ఎస్‌ పాలనపై చురకలు వేశారు సీఎం రేవంత్‌రెడ్డి. గత ప్రభుత్వం మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం వేయమని తేల్చిచెప్పారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేం దుకు ప్రపంచబ్యాంకు అంగీకరించిన విషయాన్ని క్లియర్‌గా వివరించారు. రుణమాఫీ అసాధ్యమని కొందరు గొంతెత్తారని, తమ ప్రభుత్వం రెండు లక్షల వరకు అమలు చేసి చూపించామ న్నారు. సాంకేతిక కారణాల తో కొందరికి ఆలస్యమైందని, అలాంటి వారిని గుర్తించి అందజేస్తామన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పరిపాలన కోసం సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. మంచి చెడులను విశ్లేషించుకొని తప్పులు సరిదిద్దు కుంటున్నామని తెలిపారు. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినా సంయమనం పాటిస్తున్నామని, ప్రజా స్వామ్యస్పూర్తితో పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత విభజనకు సంబంధించి ఏపీతో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. అందుకే తమ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందన్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుతో జరిపిన చర్చలు త్వరలో మంచి ఫలితాలు వస్తాయన్నారు.

సమస్యలు ఉంటే మాదృష్టికి తీసుకురావాలి..
అలాగే నిరుద్యోగులకు కీలక సూచన చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా ప్రభుత్వం దష్టికి తీసుకు రావాలని, చెప్పుడు మాటలు విని భవిష్యత్‌ చెడగొట్టుకోవద్దని సూచించారు. రాజకీయ ఉద్యోగాల కోసం జీవితాలను బలి చేసుకోవద్దన్నారు. గడిచిన పదేళ్లలో చాలా నష్టపోయారనీ, ఇకపై అలా జరగొద్దని, పెద్దన్నలా తాను నిరుద్యోగులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం అనర్హులకు రైతుబంధు ఇచ్చిందని, త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చారు. భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్‌ నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు.

త్వరలోనే విద్యా కమిషన్‌..
సైబర్‌ మోసాల బారిన పడినవారికి 1930 నెంబర్‌ ఏర్పాటు చేశామని, త్వరలో విద్యా కమిషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణను ప్రపంచానికి ముఖ ద్వారంగా మార్చాలని భావించామన్నారు. హైదరాబాద్‌ సిటీ ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి హైడ్రా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.

భూమిలేని రైతు కూలీలకు సీఎం రేవంత్‌ రెడ్డి శుభవార్త చెప్పారు. ప్రతీ రైతు కూలీకి ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ ఏడాది నుంచి దీన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. భూమిలేని పేదలు కొన్నిసార్లు కూలీ దొరక్క ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు భరోసా పకడ్బందీగా అమలు చేసి అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు.

ANN TOP 10