లోక్ సభ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి స్వయంగా ప్రధాని మోదీ రంగంలో దిగారు. తెలంగాణ పర్యటనలో భాగంగా బుధవారం కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. ఇందుకోసం ప్రధాని మోడీ మంగళవారం (మే 07) హైదరాబాద్ చేరుకున్నారు.
రాజ్భవన్లో ప్రధాని మోదీ బస చేశారు. కాగా మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని మోడీని ప్రత్యేకంగా కలిశారు. ఇటీవలే ఆయనకు కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ సందర్భంగా మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇటీవల పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు భారతరత్న అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా పీవీ సేవలను ప్రత్యేకంగా కొనియాడారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలోనే పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు మోదీని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరూ ఆయనతో కలిసి గ్రూపు ఫొటోలు దిగారు.









