ఈ సారి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ దసరా బుల్లోడిని ఇక్కడ నుంచి పంపించుడే, ఈ దసరానే ఆఖరి దసరా అని సంక్రాంతికి ఇక వచ్చుడు లేదని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను ఉద్దేశించి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. భద్రాచలంలో మాట్లాడుతూ దసరా బుల్లోళ్లను నమ్మితే అభివృద్ధి జరగదు. దసరా బుల్లోళ్లు వస్తరు దసరా, సంక్రాంతికి గంగిరెద్దుల్లా వచ్చే వారికి ఇక్కడి సమస్యలు ఏమి తెలుస్తాయి అని ప్రశ్నించారు. పండక్కు ఒకసారి వచ్చి హాజరు వేసుకునే వారిని నమ్మితే అంధకారమేనని వ్యాఖ్యానించారు. 2014లో తొలి శాసనసభలో ఐదు గ్రామాలను తక్షణమే తెలంగాణలోని భద్రాచలంలో విలీనం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కూడా కేసీఆర్ సీఎం కావడం ఖాయమని వెంటనే భధ్రాచలంను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
2200 డబుల్బెడ్రూంలు నియోజకవర్గంలో ఇవ్వడానికి సిద్దంగా ఉంటే మిగిలిన రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. భద్రాచలాన్ని వరదల నుంచి కాపాడేందుకు రూ.2,200 కోట్లతో కరకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల బాగోగులను స్వయంగా తానే చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో అమలు చేసిన ఘనుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు.









