స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ప్రతిపక్ష పార్టీ టీడీపీ.. అధికార పార్టీ వైసీపీ మధ్య చంద్రబాబు అరెస్టుపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ రాజకీయం హస్తినకు చేరింది. చంద్రబాబు అరెస్టుపై ఆయన తనయుడు.. టీడీపీ నేత నారా లోకేష్.. హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. బుధవారం రాత్రి ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్ చంద్రబాబు అరెస్టు, ఏపీలో రాజకీయ పరిస్థితులపై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందని.. ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటుందని, చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి.. జైలులో ఉంచారంటూ లోకేష్ అమిత్ షా కు వివరించారు.
జైలులో ఉన్న చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని.. ఏపీలో భయంకరమైన పరిస్థితి నెలకొందని.. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని.. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ లోకేష్ అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా.. చంద్రబాబుపై పెట్టిన కేసుల గురించి, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీలో రాజకీయ పరిణామాల గురించి కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం..
కాగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలో నారా లోకేష్ వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు.. దీనికి సంబంధించిన ఫొటోలను నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో కలిసి నారా లోకేష్ అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.









