బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం నాడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు అమిత్ షా. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు ఆదిలాబాద్కు పయనమవుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు బహిరంగ సభ ఉంటుంది. ఆ సభలో అమిత్ షా పాల్గొంటారు. మళ్లీ సాయంత్రం 4.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి.. 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తరువాత సాయంత్రం 6.20 గంటలకు మేధావులతో అమిత్ షా సమావేశం అవుతారు. రాత్రి 7.40 గంటలకు ఐసీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో.. ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహం, స్ట్రాటజీ, సమన్వయం, తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఇక రాత్రి 9:40కి బేగంపేట నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.









