రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి అధికారం చేపడుతుందని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు జనరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక స్థానాల్లో విజయం సాధించేందుకు దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
రానున్న ఎన్నికల్లో తాను పోటీచేసే నియోజకవర్గంతోపాటు పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి, బీజేపీ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ పోటీ చేసే నియోజకవర్గాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇబ్బందులకు గురి చేస్తారని తెలిపారు. తాను బీఆర్ఎస్కు వ్యతిరేకంగా గొంతు విప్పినప్పుడే ఇబ్బందులకు గురి చేస్తారని ఊహించే అన్నింటికి సిద్దమయ్యామని తెలిపారు. తన కంపెనీలకు సంబంధించిన కాంట్రాక్టు పనుల బిల్లులను సైతం ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని, అయినప్పటికీ ముందుకు సాగుతామని ప్రకటించారు. ఈ నెల 17వ తేదీన జరిగే కాంగ్రెస్ బహిరంగసభలో సోనియా గాంధీ హజరైన అనంతరం అనేక చేరికలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్కి పూర్వవైభవం వస్తుందని, ప్రజల దీవెనలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.









