బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నల్లగొండ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొద్దికాలంగా బీజేపీపై నిప్పులు చెరిగి, విమర్శలు చేసిన కేసీఆర్ సడన్ గా గవర్నర్ తో కలిసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మైత్రిని బయటపెట్టారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, గవర్నర్తో నిన్న కలసి కార్యక్రమానికి హాజరుకావడం ఇందుకు నిదర్శనమన్నారు.
రెండు పార్టీలు కలసికట్టుగానే ఇతర పార్టీలు రాష్ట్రంలో ఎదగకుండా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఉప్పు నిప్పులా ఉన్న గవర్నర్, సీఎంలు.. సయోధ్యతతో పనిచేస్తున్నట్లు.. నిన్న జరిగిన పరిణామాలతో అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి సాగునీటి ప్రాజెక్ట్ లు అంటే ఏమిటో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి చిట్టా మా దగ్గర ఉంది అని అంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయన్నారు.









