ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ రోజు కాంగ్రెస్లో చేరబోతున్నారనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. ఈ నెలాఖరున అంటే జూన్ 30న పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) తదితరులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈనెల 22న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి, కూచూకుళ్ళ దామోదర రెడ్డి, పిడమర్తి రవి తదితరులు భేటీ కానున్నారు. భేటీ అనంతరం తెలంగాణలో వేరువేరు బహిరంగ సభల్లో పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 30న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.
ఖమ్మం సభలో పొంగులేటి అండ్ టీమ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనుంది. ఈ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. పొంగులేటితో పాటు పాయం వేంకటేశ్వర్లు, కోరం కనకయ్య, పిడమర్తి రవి, తెల్లం వెంకట్రావు, బానోత్ విజయాబాయి, కోటా రాంబాబు, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, కొండూరి సుధాకర్, జారే ఆదినారాయణ, దొడ్డా నగేష్ యాదవ్ హస్తం పార్టీలో చేరనున్నారు. అలాగే మహబూబ్నగర్ బహిరంగ సభలో జూపల్లి అండ్ టీమ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనుంది. జూపల్లితో పాటు దామోదర్ రెడ్డి, మేఘారెడ్డి, కుచ్చారెడ్డి, తదితరులు కాంగ్రెస్లో చేరనున్నారు.









