తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ (Modi) అపహాస్యం చేశారని ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చారని, పార్లమెంట్లో మోదీ ఆరోపించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుపై నాడు హోంమంత్రితో 2 సార్లు చర్చించానని తెలిపారు. అప్పటి లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ఎంతో ధైర్యంతో తెలంగాణ బిల్లును పాస్ చేశారని పేర్కొన్నారు. మీరాకుమార్ ధైర్యం చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఇప్పుడు ఏలుతున్న వారు తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, 1200 మంది బలిదానాలు చేశారని ఉత్తమ్కుమార్ రెడ్డి గుర్తుచేశారు.
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్లోకి వస్తుందో లేదో తనకు తెలియదని.. కాంగ్రెస్ నుంచి ఎవరో పెద్దవాళ్ళు షర్మిలతో మాట్లాడినట్టు అనిపిస్తోందన్నారు. బీజేపీ ఊపు తగ్గుతోందన్నారు. బీజేపీలో ఎవరు మాట్లాడినా సీరియస్గా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీలో ఇన్ సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్ నడుస్తోందని అన్నారు. 2018 నుంచి రాజకీయాలు చాలా కమర్షియల్గా మారాయన్నారు. ఈ కమర్షియల్ రాజకీయాల నుంచి తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని అనుకుంటున్నట్లు వెల్లడించారు.









