అతని పేరు చెప్పను: అల్లు అరవింద్
టాలీవుడ్లో సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ ఓ ఈవెంట్లో పాల్గొని మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. గీతా ఆర్ట్స్ 2లో కీలకంగా వ్యవహరించే బన్నీ వాసు దీన్ని తెలుగులో 2018గా విడుదల చేశారు. మలయాళంలో రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి అనువాదమై ఘన విజయాన్ని సాధించింది. మంచి కలెక్షన్స్ను రాబడుతోంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘నేను అమెరికాలో ఉండగా బన్నీ వాసు ఫోన్ చేసి నాకు 2018 సినిమా గురించి చెప్పి.. దీన్ని గీతా ఆర్ట్స్లో రిలీజ్ చేస్తే బావుంటుందని అన్నాడు. నేను చూడలేదు. కానీ నువ్వు మన గీతాలో చేస్తే బావుంటుందని అనుకుంటున్నావు కాబట్టి.. సినిమా నువ్వు చూసి నచ్చితే బన్నీ వాసు అందించిన అనే వెయ్ అన్నాను. ఇందులో ఓ చిన్న విషయం ఉంది. నేను కానీ, దిల్ రాజు వంటి సీనియర్స్ చేయాల్సిందేంటంటే.. జూనియర్స్కు ఓ స్పేస్ క్రియేట్ చేయాలి. నెక్ట్స్ జనరేషన్కు ఓ స్పేస్ క్రియేట్ చేస్తే అందులో వాళ్లు ఎదుగుతారు. మనమే అంతా ఆక్రమించేసి, పేరు..డబ్బు మనకే వచ్చేయాలంటే అది కరెక్ట్ కాదు. నేను కూడా అది తెలివి తేటలుగానే గ్రహించి పక్కన వాళ్లకి స్పేస్ ఇవ్వాలనుకున్నాను. నా వ్యక్తిత్వం కూడా పక్క వాళ్లకు కూడా స్పేస్ ఇచ్చేలాగానే ఉంటుంది.
చందు మొండేటి సినిమా తీసి దాదాపు సంవత్సరం అయిపోయింది. ఏ సినిమా తీయలేదు. ఎవరిదీ ఒప్పుకోలేదు. కానీ సినిమా రిలీజ్ కాకముందే తను గొప్ప డైరెక్టర్ అని గ్రహించి నేను బుక్ చేసుకున్నాను. చాలా మంది.. నేను పేర్లు చెప్పటం అనవసరం. నా ద్వారా పైకొచ్చిన వాళ్లలో చాలా మంది ఆ గీత దాటి వెళ్లి సినిమాలు చేసిన వాళ్లు ఉన్నారు…’’ అన్నారు.
అసలు అరవింద్ వంటి సీనియర్ నిర్మాత ఎవరినీ ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే కొందరు మాత్రం డైరెక్టర్ పరశురామ్ను ఉద్దేశించే అరవింద్ అలాంటి వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు. అందుకు కారణం.. గీత గోవిందం సినిమా తర్వాత గీతా ఆర్ట్స్లో సినిమా చేయాల్సిన పరశురాం ఇంకా చేయకుండా మరో బ్యానర్లో మహేష్ సినిమా చేశాడు.. అలాగే త్వరలోనే దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నారు. ఈ పరిణామాలపైనే అరవింద్ అలా అన్నారనే వారి వాదన. మరి ఎవరిని ఉద్దేశించి అరవింద్ కామెంట్స్ చేశారనే లోగుట్లు పెరుమాళ్లకే ఎరుక.









