AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కారుతో ఢీకొట్టి.. 100 మీటర్లు లాక్కెళ్లి..

గ్రామస్థులపై హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో దారుణం
ఓ యువకుడిని అనవసరంగా చితకబాదడంతో పాటు అడిగేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలపై హెడ్ కానిస్టేబుల్ దాడికి దిగాడు. హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యాన్ని ప్రశ్నించిన మరోవ్యక్తిని కారుతో ఢీకొట్టాడు. కారు బానెట్‌పై పడిపోయిన అతడిని 100 మీటర్ల వరకు లాక్కెల్లాడు. చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో చోటు చేసుకుంది.

శంషాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చింతల్‌ గ్రామానికి చెందిన ధార కృష్ణ, బాలమణి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా జానేశ్వర్ తన ఇంటి ముందు రహదారిపై వెళ్తున్న గ్రామస్థులను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఘర్షణకు దిగితున్నాడు. ఈ క్రమంలోనే తన పొలానికి వెళ్తున్న ధార కృష్ణ కుమారుడు పవన్‌ కుమార్‌తో హెడ్‌ కానిస్టేబుల్‌ జ్ఞానేశ్వర్, అతని కుమారుడు వంశీ అకారణంగా గొడవపడ్డారు. పవన్‌ను ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో అతడు స్పృహ తప్పిపడిపోయాడు. ఆవేదనకు గురైన పవన్‌ తల్లి బాలమణి, సోదరి రూప హెడ్ కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హెడ్‌ కానిస్టేబుల్‌ జ్ఞానేశ్వర్‌.. బాలమణి, రూపలపై సైతం దాడి చేశాడు.

ఈ ఘటనపై బాలమణి బంధువు రాజు సహా పలువురు గ్రామస్థులు వెళ్లి జ్ఞానేశ్వర్‌ను నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన జ్ఞానేశ్వర్‌ తన కారును స్టార్ట్ చేసి వేగంగా వారిని ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. గ్రామస్తులు పక్కకు తప్పించుకోగా.. రాజు మాత్రం కారు బానెట్‌పై పడిపోయాడు. ఏ మాత్రం కనికరం లేకుండా దుర్మార్గంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ అతడిని అలాగే 100 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లాడు. అనంతరం ఎక్కువ మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. హెడ్ కానిస్టేబుల్ దాడిలో గాయపడిన పవన్, బాలమణి, రూప, రాజులను గ్రామస్థులు ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ANN TOP 10