నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూ వస్తోన్న ఐపీఎల్ ఇక క్లైమాక్స్కు చేరుకుంది. ధనాధన్ లీగ్ ఫైనల్ మ్యాచ్కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. జరగనున్న ఈ మ్యాచ్కు ఇప్పుడు వర్షం ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే 2వ క్వాలిఫయర్ మ్యాచ్కు ముందు అహ్మదాబాద్లో భారీ వర్షం కురిసింది. అయితే అదృష్టవశాత్తూ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ఆగిపోయింది.
అయినా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో వర్షం పడితే ఏం జరుగుతుందనేది ప్రశ్న. ఫైనల్ మ్యాచ్లో వర్షం పడితే ఐపీఎల్ రెయిన్ రూల్స్ ప్రకారం మ్యాచ్ జరగనుంది. అంటే వర్షం పడితే మ్యాచ్ నిర్వహించేందుకు కొన్ని నిబంధనలు రూపొందించారు. ఈ నియమాల ప్రకారం ఫైనల్కు ముందు వర్షం కురిసి మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనా ఓవర్లలో ఏ మాత్రం కోత ఉండదు. అంటే రాత్రి 9.40 గంటలకు ముందు మ్యాచ్ ప్రారంభమైతే ఓవర్ కట్ ఉండదు. ఇరు జట్లు 20 ఓవర్లు ఆడతాయి. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రాత్రి 9.40 గంటల తర్వాత ప్రారంభమైతే మాత్రం ఓవర్లను కుదిస్తారు. ఆ తర్వాత డక్వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం ఫలితం తేలాలంటే ఇరు జట్లూ కనీసం 5 ఓవర్లు ఆడాలి.