AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ.50 కోట్లతో జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి

అభివృద్ది పనులకు త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన!
మతసామరస్యానికి ప్రతీకైన జహంగీర్ పీర్ దర్గా అభివృద్ది పనులు సైతం త్వరలో ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నగరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలో గల ఈ దర్గాకు కులం, మతం, లింగ భేదం లేకుండా వారాంతాల్లో, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ దర్గాను సందర్శిస్తారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. 2017లో సీఎం కేసీఆర్‌ దర్గాను సందర్శించి మెుక్కులు తీర్చుకున్నారు. దర్గా అభివృద్ధికి రూ. 50 కోట్ల నిధులు ప్రకటించారు.

ఈ మేరకు త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నట్లు టీఎస్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మసీవుల్లాఖాన్‌ తెలిపారు. పనుల ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. కొన్ని చట్టపరమైన అడ్డంకుల వల్ల దర్గా అభివృద్ది పనులు ఆలస్యమయ్యాయని… ఇప్పుడా అడ్డంకులు తొలిగిపోవటంతో త్వరలోనే పనులు ప్రారంభవుతాయని చెప్పారు.

దర్గా అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం దాదాపు 30 ఎకరాల భూమిని సేకరించిందన్నారు. విశాలమైన నియాజ్ ఖానా, సమా ఖానా, దుకాణాలు, వినోద సౌకర్యాలు, పార్కులు, కాటేజీలు, పార్కింగ్, అంతర్గత రోడ్లు తదితర అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆయన చెప్పారు. ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందని.. ప్రముఖ సంస్థకు పనులను అప్పజెప్పనున్నట్లు మసీవుల్లాఖాన్ వెల్లడించారు. ప్రణాళిక ప్రకారం దర్గా మధ్యలో ఉంటుందని.. అర కిలోమీటరు దూరం నుంచి కూడా మందిరాన్ని సులభంగా చూడవచ్చునని చెప్పారు. అనేక సౌకర్యాలతో ఈ దర్గాను టూరిస్ట్ హబ్‌గా మార్చచేందుకు ప్రణాళిక రూపొందించనట్లు వెల్లడించారు. మెగా పార్కింగ్ కాంప్లెక్స్‌తో పాటు అతిథి గృహాలు కూడా నిర్మించనున్నట్లు తెలిపారు.

ANN TOP 10