AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బజరంగ్‌దళ్ నిషేధానికి కేసీఆర్ కుట్ర…

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం బీజేపీ ఓబీసీ సమ్మేళనంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో భజరంగ్‌దళ్‌ను నిషేధించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. బజరంగ్‌దళ్‌ను నిషేధించడంలో కాంగ్రెస్‌తో కేసీఆర్ పోటీ పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుట్రను తిప్పికొట్టటానికి హిందువులంతా ఏకంకావాలని పిలుపునిచ్చారు.

బండి సంజయ్ ఇంకా మాట్లాడుతూ… బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇవ్వటం‌ వెనుక కుట్ర దాగుందన్నారు. బీసీబంధు ప్రకటించటానికి ఇబ్బంది ఏంటో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో హైదరాబాద్ వేదికగా లక్షల మందితో బీసీ శంఖారావ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రామ రాజ్యం కోసం ఐదు నెలలు సమయం ఇవ్వాలని క్యాడర్‌కు బండి పిలుపునిచ్చారు. కేసీఆర్ క్యాబినెట్‌లో ముగ్గురు మాత్రమే బీసీ మంత్రులున్నారని… కేసీఆర్ కుటుంబానికి మాత్రం నాలుగు మంత్రి పదవులా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించి బీసీల పొట్టకొట్టిందని విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు.

రూ.1600 కోట్లతో సచివాలయం కట్టిన కేసీఆర్… బీసీల ఆత్మగౌరవ భవనం ఎందుకు నిర్మించటం‌లేదని ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఏ మాత్రం ఉండదని స్పష్టం చేశారు. దళితబంధులో 30 శాతం కమిషన్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని ఆరోపించారు. 30 శాతం కమిషన్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ANN TOP 10