కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయంటూ నాలుగు రోజులుగా తీవ్ర ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల్లో మార్పులు, చేరికలు జరుగుతున్నాయంటూ ఊహగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పార్టీ మారిన పలువురు కీలక నేతలు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పలు పార్టీల్లో అలజడి మొదలైంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంత గూటికి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే. ఈ ప్రచారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
తాను జీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్లో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతోనే తన ప్రయాణమని.. కావాలనే తప్పుడు ప్రచారం చేసి.. తన అభిమానులను గజిబిజి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దంటూ కోమటిరెడ్డి సూచించారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను బీజేపీ తరపున మునుగోడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ట్వీట్ చేసి వెల్లడించారు.









