రాష్ట్రంలో భానుడు భగభగలతో మంట పుట్టిస్తున్నాడు. మండేఎండలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. సూర్యుడి సెగ తట్టుకోలేక రోజూ చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. బుధవారం రాష్ట్రంలో ఇద్దరు వడదెబ్బకు గురై మృతిచెందారు. వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మే 31 వరకు ఈ రెండు వారాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల దాటాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 44.8 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం 43.2, ఆదిలాబాద్ 41.3, భద్రాచలం 42.8,హనుమకొండ 41, హైదరాబాద్ 39.5, మహబూబ్నగర్ 40.8,మెదక్ 40.8, నిజామాబాద్ 40.9, రామగుండంలో 42 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అధిక ఉష్ణోగ్రతలకు భయపడి జనం బయటకు రావటం లేదు. జంట నగరాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత భారీగా పెరుతున్నది. నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగా హైదరాబాద్ రోడ్ల పరిస్థితి తయారవుతున్నది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల సమయంలో గ్రేటర్లో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.









