ఆర్థిక మాంద్యం భయాలతో ఈ ఏడాది ఆరంభం నుంచి సుమారు 18 వేల మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్.. తాజాగా మరోసారి లేఆఫ్స్కు సిద్ధమైంది.
రెండో విడత ఉద్యోగుల తొలగింపును మార్చి నెలలోనే కంపెనీ సీఈవో యాండీ జెస్సీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ‘రాబోయే రోజుల్లో మరింత అస్థిరత నెలకొనే అవకాశాలు ఉండటంతో కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకోవాలని భావిస్తున్నాం. అందులో భాగంగా మరికొంతమంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించాం. వచ్చే నెలలో ఈ తొలగింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. త్వరలోనే దీనిపై ఉద్యోగులకు సమాచారం అందిస్తాం’ అని జెస్సీ (Andy Jassy) చెప్పారు. అమెజాన్ రెండో విడత వార్షిక ప్రణాళిక ప్రక్రియ సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.
కంపెనీ నిర్ణయంతో భారత్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 500 మంది వరకు లేఆఫ్లకు గురవుతారని అంచనా. తొలగింపుకు గురవుతున్నవారిలో ఎక్కువ మంది వెబ్ సర్వీసెస్, హెచ్ఆర్, సహాయ విభాగానికి చెందిన వారు ఉన్నారు. మార్చి నెలలో 9 వేల మంది ఉద్యోగుల తొలగిస్తామని సంస్థ చేసిన ప్రకటనలో భాగంగానే ఇండియాలో ఉద్యోగులకు పింక్ స్లిప్లు అందిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులకు పింక్ స్లిప్లు అందించారని కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి తెలిపారు.









