కొద్దిరోజులుగా వర్షాలు తగ్గి రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. గత నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఎండ ప్రభావంతో పాటు వడగాల్పుల తీవ్రత బాగా ఎక్కువైంది. అలాగే ఉక్కబోత కూడా ఎక్కువ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశముందని స్పష్టం చేసింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప పగటిపూట బయటకు రావొద్దని సూచనలు చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ బెలిటెన్ విడుదల చేసింది. 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎండ ప్రతాపంతో పాటు వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది.









