బస్సులో మర్చిపోయిన 50 తులాల బంగారం తిరిగిచ్చారు
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి అందించి ప్రశంసలు అందుకున్నారు. విశాఖపట్నం కాంప్లెక్స్లో ఆర్టీసీ బస్సులో పలాస డిపోకు చెందిన బస్సు ఆగి ఉంది. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన శోభారాణి అదే బస్సులో.. తన లగేజీ బ్యాగు ఉంచి కండక్టర్, డ్రైవరుకు చెప్పకుండా కిందికి దిగిపోయారు. ఆమె తిరిగి వచ్చి చూసేసరికి బస్సు అక్కడ లేదు. ఆమె బస్సులో ఉంచిన లగేజీలో భారీగా బంగారం ఉంది. వెంటనే డిపోలో బస్సులేకపోవటంతో కంగారు పడిన ఆమె.. వెంటనే అక్కడే ఉన్న టెక్కలి డిపో కండక్టర్ ధనుంజయకు చెప్పారు. ఆయన వెంటనే పలాస ఆర్టీసీ డిపో సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఆ వెంటనే డిపో నుంచి ఆ బస్సు కండక్టర్ ఆర్.వి.రావుకు సమాచారం అందించారు. ఆయన డ్రైవర్తో కలిసి బ్యాగును గుర్తించి భద్రపరిచారు.. పలాసలో డిపో మేనేజర్కు అందజేశారు. శోభారాణి శుక్రవారం మధ్యాహ్నం డిపోకు వచ్చారు.. రూ.35 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, దుస్తులత బ్యాగును తీసుకున్నారు. బంగారం, బ్యాగును జాగ్రత్తగా భద్రపరిచిన డ్రైవర్ ఎన్.హెచ్.ప్రసాద్, కండక్టర్ ఆర్.వి.రావులను డిపో మేనేజర్ వి.శ్రీనివాస అభినందించారు. పోయిందనుకున్న బంగారం దొరకడంతో శోభారాణి సంతోషం వ్యక్తం చేశారు.. ఆర్టీసీ బస్సు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.









