తెలంగాణలో మావోయిస్టుల అలజడి కలకలం రేపుతోంది. ఇటీవల జగిత్యాల జిల్లాలో బెదిరింపు లేఖలు.. తాజాగా.. మావోయిస్టులకు డబ్బు తరలిస్తూ నలుగురు అరెస్టవ్వడం చర్చనీయాంశంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిషేధిత మావోయిస్టులకు సహాయం చేస్తూ.. డబ్బులు చేరవేస్తున్న నలుగురిని కాటారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 76.57 లక్షల నగదుతో పాటు, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాలుగుసెల్ ఫోన్లు, డిజిటల్ వాచ్చీలు, ఒక ట్యాబ్తో పాటు మెడికల్ కిట్, జిలిటెన్ స్టిక్స్ తదితర పేలుడు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పి సురేందర్ రెడ్డి వెల్లడించారు.
నిందితులు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని సీజ్ చేశామని సురేందర్ రెడ్డి తెలిపారు. వీరికి సహాయం చేసిన మరికొంతమంది పరారీలో ఉన్నారని తెలిపారు. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. కాగా.. తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల అలజడి నేపథ్యంలో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.