ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ఫైర్
సింగరేణి పట్ల కేంద్రానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ కంపెనీనికి నామినేషన్ మీద ఇవ్వమని అడిగాం అని మంత్రి కేటీఆర్ (KTR) గుర్తు చేశారు. దాని మీద ఎలాంటి స్పందన లేదు. అదే గుజరాత్లో అయితే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడిగితే నాలుగు బొగ్గు గనులు రాసిచ్చిండు ప్రధాని మోదీ (PM Modi). మన దగ్గరికి వచ్చేసరికి వేలం పాటలో పాల్గొనండి అని చెబుతున్నారు.
గాలి మోటారులో వచ్చి సింగరేణిని అమ్మబోమని అని మోదీ గాలి మాటలు చెప్పారని గుర్తు చేశారు. తెల్లారే నాలుగు బొగ్గు గనులను వేలానికి పెట్టావు. ఇది వాస్తవం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సింగరేణిని మరింత ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఉంటే.. వెంటనే ఆ నాలుగు బొగ్గు గనులను సింగరేణికి కేటాయిచాలని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు.
తెలంగాణ కొంగు బంగారం సింగరేణి.. రాష్ట్రానికే వెలుగుల మణిహారం సింగరేణి.. సింగరేణి అంటే ఒక కంపెనీ కాదు.. సింగరేణి అంటే తెలంగాణ భాగ్యరేఖ.. తెలంగాణ జీవనాడి అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తే రామగుండం అగ్గి గుండం అవుతుందని కేటీఆర్ కేంద్రాన్ని హెచ్చరించారు. రామగుండ కార్పొరేషన్ పరిధిలో రూ. 300 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.









