హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ టూర్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం సా.3.30 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో బేగంపేటకు వస్తారు. బేగంపేట (Begumpet) నుంచి రోడ్డు మార్గాన ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి అర్పిస్తారు. ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ స్టేడియానికి చేరుకుంటారు. సరూర్నగర్ స్టేడియంలో కాంగ్రెస్ (Congress) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు. ప్రియాంక ప్రసంగం 20 నుంచి 25 నిమిషాలపాటు ఉంటుంది. సభ ముగిసిన తర్వాత.. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.









