మణిపూర్లోని హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు సైతం బిక్కుబిక్కుమంటూ నెట్టుకువస్తున్నారు. ఇంఫాల్ నీట్ సహా పలు విద్యాసంస్థల్లో తెలంగాణ విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగుతున్నారు. ప్రస్తుతం మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులంతా గదులకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వారంతా తినేందుకు తిండి సైతం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మణిపూర్లో తెలంగాణకు చెందిన 250 మంది విద్యార్థులను విమానం ద్వారా రాష్ట్రానికి తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంఫాల్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానాన్ని విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి మణిపూర్ సీఎస్తో మాట్లాడారు.
ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ATSUM) నేతృత్వంలో జరిగిన ర్యాలి హింసాత్మకంగా మారినప్పటి నుంచి మణిపూర్ అట్టుడుకుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. మరోవైపు రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం పారామిలటరీ బలగాలను సైతం మోహరించింది. అలాగే అల్లర్లను, ఘర్షణలను కట్టడి చేసేందుకు కనిపిస్తే కాల్చివేయమని గవర్నర్ ఆదేశించారు. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు మణిపూర్లో నెలకొన్నాయి.









