ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఏ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. మణిపూర్ లో హింసాకాండ, జమ్ముకశ్మీర్ లో జవాన్ల మరణంపై స్పందించకుండా.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ప్రధానిపై నిప్పులు చెరిగారు. మణిపూర్ తగలబడుతుంటే.. జమ్మూలో ఉగ్రవాదుల చేతిలో సైనికులు మరణిస్తుంటే.. బెంగళూరులో రోడ్ షో నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ‘పాకిస్తాన్ మద్దతుతో ఉగ్రవాదులు మన సైనికులను పొట్టన బెట్టుకుంటున్నారు.. మణిపూర్ లో భయానక పరిస్థితి నెలకొంది. గ్రామాలు తగలబడుతున్నాయి. ప్రజలు ఊళ్లను వదిలి పారిపోతున్నారు.కానీ ప్రధాని మాత్రం ఈ సమస్యలన్నీ గాలికొదిలేసి ది కేరళ స్టోరి గురించి మాట్లాడటం బాధాకరం’ అన్నారు. కేవలం కర్నాటకలో గెలవడం కోసమే అసత్యాలు, తప్పుడు ప్రచారాలతో తీసిన ‘ది కేరళ స్టోరి’ సినిమాని సమర్థిస్తున్నారని విమర్శస్తూ.. బళ్లారి బహిరంగ సభలో ప్రధాని మోదీ సినిమా గురించి మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.









