స్థాయి మరిచి దాడికి దిగిన ఇరు దేశాల నాయకులు
ఉక్రెయిన్, రష్యా మధ్య గత 14 నెలల నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ అంతర్జాతీయ వేదికపై ఎదురుపడిన రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు అనూహ్యంగా గొడవకు దిగారు. తమస్థాయి, స్థానం మరిచి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనకు తుర్కియే రాజధాని అంకార నగరం వేదికయ్యింది. రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యలతో సహనం కోల్పోయిన ఉక్రెయిన్ ఎంపీ ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారాయి.
గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర చేపట్టడంతో ఇరు దేశాల 14 నెలలుగా యుద్ధం జరుగుతోంది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా అంకారాలో ‘బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ’ 61వ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఉక్రెయిన్ ప్రతినిధిగా ఆ దేశ ఎంపీ ఒలెక్సాండర్ మారికోవ్స్కీ హాజరయ్యారు. ఆయన ఉక్రెయిన జెండాను ప్రదర్శిస్తుండగా… అదే సమయంలో రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆ జెండాను లాక్కొని దూరంగా వెళ్లబోయారు. దీంతో ఆగ్రహానికి గురైన మారికోవ్స్కీ.. రష్యా ప్రతినిధి అడ్డుకున్నారు. అతడి ముఖంపై ఒక్కటిచ్చి తన జాతీయ జెండాను వెనక్కి తీసుకున్నారు.









