భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల పిడుగులు, వడగళ్లతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మేడ్చల్, ఉమ్మడి నల్లగొండ జిల్లా, మహబూబ్నగర్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కాగా.. ఈరోజు తెల్లవారుజాము నుంచి నగరంలో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం నుంచి నగరంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. రోడ్లపై వరద నీటి చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హిమాయత్నగర్, నారాయణగూడ, చిక్కడపల్లి, ఏఎస్రావు నగర్, కుషాయిగూడ, నాగారం, కీసర, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, చర్లపల్లి, నాంపల్లి, లక్డీకాపూల్, మాసబ్ట్యాంక్, మెహదీపట్నం, టోలిచౌకి, మణికొండలో భారీ వర్షం కురిసింది. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర మోకాళ్ల లోతులో నీళ్లు చేరాయి. పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైల్ నిలయం రైల్వే అండర్ పాస్లో వర్షపు నీరు నిలిచింది.









