బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జియా ఖాన్ ఆత్మహత్యకు కారణమయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలీ కుమారుడు సూరజ్ పంచోలీ నిర్దోషిగా విడుదల చేసింది. సూరజ్ కారణంగానే జియా ఖాన్ సూసైడ్కు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో సీబీఐ కోర్టు ఈ యంగ్ హీరోను నిర్దోషిగా ప్రకటించింది. కాగా 25 ఏళ్ల జియాఖాన్ 2013లో ముంబైలోని తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతికి ప్రియుడు బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలీ కారణమని జియా తల్లి రబియా ఖాన్ ఆరోపించారు.
అదే సమయంలో జియా రాసిన లేఖలో విషయాల ఆధారంగా సూరజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2013 అక్టోబరులో సీబీఐ విచారణ కోరుతూ జియా తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు జూలై 2014లో మహారాష్ట్ర పోలీసుల నుంచి ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఈ కేసులో 22 మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్ విచారించింది. గత వారం సీబీఐ స్పెషల్ కోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో తాజాగా ఈ కేసులో సూరజ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ తుది తీర్పును వెలువరించింది సీబీఐ కోర్టు. అయితే ఈ తీర్పును జియాఖాన్ తల్లి అప్పీల్ చేసే అవకాశం ఉంది.









