కేటుగాళ్లు రోజు రోజుకు రాటుదేలుతున్నారు. అమాయక ప్రజల ఆశలనే అస్త్రాలుగా మార్చుకుని నిలువునా దోచేసుకుంటున్నారు. అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి.. ప్రజల వద్ద నుంచి పెట్టుబడులతో పేరుతో డబ్బులు వసూలు చేసి.. ఆ పై ఉడాయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా క్యూనెట్ సంస్థ తరహాలో మోసాలు విపరీతమయ్యాయి. తాజాగా క్యూనెట్ తరహా మోసాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కన్నెర్ర చేశారు. బాధితులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తూ.. నిందిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఘీంకరించారు. చాపకింద నీరులా క్యూనెట్ తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయని, మోసాలపై ఎంత చెబుతున్నా తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు సజ్జనార్. తనకు తనకు కొందరు బాధితులు ఆశ్రయించారంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సజ్జనార్ ట్వీట్ యధావిధంగా..
‘‘ఎంత చెబుతోన్న డెరెక్ట్ సెల్లింగ్ ముసుగులో గొలుసుకట్టు మోసాలు జరుగుతూనే ఉన్నాయి. చాపకింద నీరులా #QNet తరహా దందాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ యువ చార్టర్డ్ అకౌంటెంట్ దుర్మార్గపు సంస్థ #QNet వలలో చిక్కుక్కున్నారు. అధిక డబ్బుకు ఆశపడి రూ.8 లక్షలను సమర్పించుకున్నట్లు ట్విట్టర్ ద్వారా నా దృష్టి తీసుకువచ్చాడు. న్యాయం చేయాలంటూ ఇటీవల నన్ను కలిశాడు. ఆ చార్టర్డ్ అకౌంటెంట్ మాదిరిగా ఎంతో మంది మోసపోయామంటూ నాకు ట్విట్టర్లో సందేశాలు పంపిస్తున్నారు. మోసపూరిత ఎంఎల్ఎం సంస్థలపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దృష్టి సారించాలి. ఈ ఘటనలపై సుమోటోగా కేసు నమోదు చేసి బాధ్యులను చట్టప్రకారం శిక్షించాలి.’’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.









