నగరవాసులకు సీపీ సీవీ ఆనంద్ సూచనలు
కొత్త వారిని పనిలో పెట్టుకుంటున్నారా? మీ స్థానిక పోలీసుల సహకారంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే వారిని నియమించుకోవాలి. అందుకు పోలీసులు ఎంత పని ఒత్తిడి ఉన్నా మీకు సహాయం చేస్తారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ వ్యాపారి ఇంట్లో ఇద్దరు మహిళలు పనిలో చేరారు. రెండు రోజుల తర్వాత అదును చూసి ఇంట్లో ఉన్న వృద్ధుల కండ్లలో కారం కొట్టి 150 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 200 సీసీ కెమెరాలను విశ్లేషించి, నిందితులు పాత నేరస్తులుగా గుర్తించారు. ముంబైలో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 120 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీపీ సీవీ ఆనంద్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.









