సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేంత తప్పు తామేం చేశామని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. ఏపీలో పలువురు న్యాయవాదులకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ న్యాయవిభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్, హోంమంత్రి, డీజీపీ చేస్తున్నది చాలా తప్పన్నారు. సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దర్యాప్తు పేరుతో తమను వేధించి ఆనందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.ఎవరూ రోడ్డుపైకి రాకూడదని జీవో తెచ్చారని ఆక్షేపించారు. నిరసన తెలిపేందుకు రోడ్డుపైకి వస్తాం.. కావాలంటే అరెస్టు చేయండని శ్రావణ కుమార్ సవాల్ విసిరారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మంచి పనులకు వినియోగించాలని సూచించారు. వైకాపా నేతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శ్రావణ్ కుమార్ విమర్శించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా బాధితులకు న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.









