రేణుక చౌదరి
హైదరాబాద్: తాను ఎక్కడికైనా వెళ్లాలి అంటూ పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా అంటూ పోలీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుక చౌదరి (Congress Senior Leader Renuka Chowdari) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం నిమ్స్కు చేరుకున్న రేణుక.. ఖమ్మం ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఖమ్మం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బాంబులు పేల్చడం వల్ల జరిగిన దుర్ఘటనలో అమాయకులు బలయ్యారన్నారు. వారిని పరామర్శించడానికి వెళితే తనను అడ్డుకున్నారని మండిపడ్డారు.
లోకల్ మంత్రి ఓ పనికి మాలిన వ్యక్తి అని… కోట్లు పెట్టీ మరీ ఎమ్మెల్యేలను కొన్నారన్నారు. తమరు పేల్చిన బాంబులకు ప్రాణాలు పోయి, గాయ పడితే ఇప్పటి వరకు ఆర్థిక సహాయం చేయరా అని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరని నిలదీవారు. ఘటనా స్థలికి వెళితే తనపై దొంగ కేసులు పెట్టారని మండిపడ్డారు. పోలీసులు కొరివితో తల గోక్కోవద్దని.. పోలీస్ వ్యవస్థ గౌరవం పోయేలా వ్యవహరించోద్దని రేణుకా చౌదరి హితవుపలికారు.









