వీడియో వైరల్
పెళ్లి మండపంలో కూర్చున్న వధూవరులు దండలు మార్చుకుంటున్న సమయంలో హఠాత్తుగా వధువు తుపాకీ పట్టుకుని గాల్లో వరసగా కాల్పులు జరపడంతో కొత్త పెళ్లికొడుకు బిత్తరపోయాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో గత శుక్రవారం చోటుచేసుకుంది.ఈ విషయం తెలిసి పోలీసులు ఆ 23 ఏళ్ల వధువుపై కేసు నమోదు చేయగా అరెస్టుకు భయపడి ఆమె పారిపోయింది. పెళ్లి మండపంలో కూర్చున్న వధువు రాగిణికి బంధువులలో ఒకరు పిస్టల్ అందివ్వగా ఆమె వెంటనే గాల్లోకి టపటపా మంటూ పేల్చేసింది. పక్కనే కూర్చున్న వరుడికి షాక్ కొట్టినంత పయ్యింది.ఈ దృశ్యాన్నంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకిదిగారు. రాగిణిపై ఐపిసిలోని సెక్షన్ 25(9) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్న విషయం తెలియగానే రాగిణి పరారైనట్లు హత్రాస్ జిల్లా ఎఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. ఆమె చేతికి పిస్టల్ అందించిన వ్యక్తి గురించి కూడా ఆరా తీస్తున్నట్లు ఆయన చెప్పారు. పెళ్లి వేడుకల సందర్భంగా వధువు రాగిణి నాలుగుసార్లు గాల్లో కాల్పులు జరిపిందని, ఇది చట్టరీత్యా నేరమని ఆయన తెలిపారు. గన్లైసెన్స్ పొందిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.









