బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో అక్రమ నిర్మాణాలను అరికట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్ వేదికగా.. కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేబీఆర్ చుట్టూ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని, అందుకే వాటి చుట్టూ కమెర్షియల్ నిర్మాణాలు తక్కువగా ఉన్నాయని..అయితే ఇప్పుడు ఉన్న కమెర్షియల్ కాంప్లెక్స్లు కూడా ..బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే నిర్మించారని తెలిపారు.గ్రీన్ జోన్లో నిబంధనలు ఉల్లంఘించి కట్టడానికి అనుమతినిచ్చారని ఆరోపించారు.
నిజాం వారసత్వ భవనాన్ని కొనుగోలు చేసి కొత్త భవనం కడుతున్నారని.. నవాబుల పాత బంగ్లాను కూలగొట్టడానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.5 అంతస్తులకు అనుమతినిచ్చిన చోట 21 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చివరకు క్యాన్సర్ ఆసుపత్రి కూడా 3 అంతస్తులు మించలేదని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ కు అంతరాయానికి ఇవే కారణమని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోతే.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.