ముదురుతున్న సరిహద్దు వివాదం: పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అఫ్గన్ వైమానిక దాడులకు ప్రతికారంగా పాక్ సైన్యం కాబూల్, కాందహార్తో సహా 29 ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సుమారు 297 మంది తాలిబన్లు, ఉగ్రవాదులు హతమైనట్లు పాక్ ప్రకటించగా, తాము కూడా 55 మంది పాక్ సైనికులను అంతం చేశామని తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. 2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అతిపెద్ద ఘర్షణ ఇదే కావడం గమనార్హం.
ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఈ పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ ఘర్షణల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. అయితే, ఇదే సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లను ఆయన ఆకాశానికెత్తేశారు. వారు “గొప్ప వ్యక్తులు” అని, తాను వారిని నిజంగా గౌరవిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ తనను తాను రక్షించుకోవడంలో అద్భుతంగా పనిచేస్తోందని ఆయన ప్రశంసించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
అమెరికా విదేశాంగ శాఖ మద్దతు: ట్రంప్ వ్యక్తిగత ప్రశంసలు ఒకవైపు ఉంటే, అమెరికా విదేశాంగ శాఖ మాత్రం పాకిస్థాన్కు దౌత్యపరమైన మద్దతు ప్రకటించింది. ఉగ్రవాద దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు పాకిస్థాన్కు ఉందని పేర్కొంది. అఫ్గన్ గడ్డను ఉగ్రవాదులు లాంచ్ ప్యాడ్గా వాడుకుంటున్నారని, ఉగ్రవాద నిరోధంలో తాలిబన్లు విఫలమయ్యారని అమెరికా విమర్శించింది. మరోవైపు బ్రిటన్, చైనాలు మాత్రం ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరుతూ మధ్యవర్తిత్వానికి మొగ్గు చూపుతున్నాయి.









