రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ నాగేన్ రాయ్కు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం ‘బంగ విభూషణ్’ ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య నిత్యం ఉప్పు నిప్పులా ఉండే ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఒక సిట్టింగ్ బీజేపీ ఎంపీని గౌరవించడం వెనుక మమత వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రాజ్ బాంగ్షీ ఓటు బ్యాంక్ లక్ష్యంగా: నాగేన్ రాయ్ (అనంత్ మహారాజ్) కేవలం ఒక ఎంపీ మాత్రమే కాదు, ఉత్తర మరియు మధ్య బెంగాల్లో అత్యంత బలమైన రాజ్ బాంగ్షీ సామాజిక వర్గానికి తిరుగులేని నాయకుడు. ముర్షిదాబాద్, మాల్దా, జల్ పాయ్ గుడీ వంటి జిల్లాల్లో ఈ వర్గం ఓటర్లు ఎన్నికల ఫలితాలను శాసించగలరు. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో టీఎంసీ దెబ్బతినగా, బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు నాగేన్ రాయ్ను పురస్కారంతో గౌరవించడం ద్వారా, ఆ సామాజిక వర్గం ఓటర్లను తనవైపు తిప్పుకోవాలని మమతా బెనర్జీ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
నాగేన్ రాయ్ అసంతృప్తి – మమత స్నేహహస్తం: నాగేన్ రాయ్ గతంలో టీఎంసీకి సన్నిహితంగా ఉండి, ఆపై బీజేపీలో చేరి ఎంపీ అయ్యారు. అయితే, ఇటీవల ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలపై ఆయన బీజేపీ అధిష్ఠానం పట్ల కొంత అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఆయన ఇంటికి వెళ్లి మరీ మర్యాదపూర్వక భేటీ నిర్వహించిన మమత, ఇప్పుడు పురస్కారం ద్వారా మరోసారి స్నేహహస్తం అందించారు. ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం రాజ్ బాంగ్షీ ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసి, ఉత్తర బెంగాల్లో రాజకీయ సమీకరణాలను మారుస్తుందేమో వేచి చూడాలి.








