తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు “ఉచితాల సంస్కృతి” (Freebie Culture) పై తీవ్ర విమర్శలు గుప్పించింది. సంక్షేమం పేరుతో విచక్షణారహితంగా ఉచితాలను పంపిణీ చేస్తే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుందని హెచ్చరించింది. ప్రభుత్వం ఉదయం లేవగానే ఉచిత ఆహారం, కరెంటు, సైకిళ్లు.. ఇలా చివరికి నేరుగా నగదు బదిలీ చేసే స్థాయికి చేరుకోవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు కేవలం అట్టడుగు వర్గాలకు అందాలి కానీ, ఆర్థిక స్థోమత ఉన్నవారికి కూడా పంపిణీ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ, కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ఇలాంటి పథకాలను ప్రకటిస్తున్నాయని కోర్టు మండిపడింది. సబ్సిడీల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం వల్ల మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు మరియు కళాశాలల అభివృద్ధికి నిధులు కొరవడుతున్నాయని ధ్వజమెత్తింది. “ఈ పద్ధతి కొనసాగితే భవిష్యత్తులో వాస్తవ అభివృద్ధికి ఒక్క పైసా కూడా మిగలదు” అని వ్యాఖ్యానించిన కోర్టు, ఇది ఒక్క తమిళనాడు సమస్య మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది.
ముఖ్యంగా, పనిచేయకుండానే ప్రతిఫలం లభించే ఈ సంస్కృతి ప్రజలను ‘పరాన్న జీవులుగా’ మారుస్తోందని మరియు సోమరితనాన్ని పెంచుతోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సంపన్నులు కూడా ఉచితాలను ముందుగా వారి జేబుల్లో నింపుకుంటున్నారని, రాష్ట్రాలు తమ విధానపరమైన నిర్ణయాలను పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని సూచించింది. కనీసం ఒక త్రైమాసిక ఆదాయాన్ని మౌలిక సదుపాయాల కల్పనకే కేటాయించాలని, భవిష్యత్తు తరాలపై భరించలేని ఆర్థిక భారాన్ని మోపవద్దని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాలను ఆదేశించింది.








