కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కార్మిక చట్టాలు మరియు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న (గురువారం) దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని రైతు, కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సుమారు 10 ప్రధాన కార్మిక సంఘాలు ఈ నిరసనలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఈ బంద్ కారణంగా రవాణా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, సామాన్య ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సంఘాల నేతలు సూచిస్తున్నారు.
బంద్ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుందా అన్న దానిపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుతానికి ప్రభుత్వం విద్యాసంస్థలకు ఎలాంటి అధికారిక సెలవు ప్రకటించలేదు. అయితే, బంద్ తీవ్రతను బట్టి మరియు రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల కలెక్టర్లు లేదా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు రేపు ఉదయం నిర్ణయం తీసుకునే అవకాశముంది. అత్యవసర సేవలు, ఆసుపత్రులు మరియు పాల సరఫరా వంటివి బంద్ పరిధిలోకి రావు.
నిరసనకారులు ప్రధానంగా విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లును రద్దు చేయాలని మరియు ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. బంద్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.








