హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ, గత రెండేళ్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిజానిజాలు త్వరగా బయటపడాలని, దోషులకు కఠిన శిక్ష పడాలని ఆమె కోరారు. తన ఫోన్ మరియు తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే బలమైన అనుమానాలు ఉన్నాయని, దీనిపై విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకవేళ సిట్ (SIT) అధికారులు తనను విచారణకు పిలిస్తే, ఖచ్చితంగా హాజరై పూర్తిస్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ అధికారులు విచారించడంపై స్పందిస్తూ, విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ స్వయంగా వెల్లడిస్తారని తాను భావిస్తున్నట్లు కవిత తెలిపారు. అయితే, ఈ విచారణ ప్రక్రియను తప్పుపడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఆమె విభేదించడం గమనార్హం. చట్టాలను అందరూ గౌరవించాలని, విచారణా సంస్థలకు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతోందని ఆమె విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా కేసీఆర్ను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావడంతో ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. బాధితులుగా ఉన్న పలువురు నేతల వాంగ్మూలాలను కూడా అధికారులు ఇప్పటికే నమోదు చేశారు.









