భారతదేశంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్లపై కేంద్ర ప్రభుత్వం తన పట్టు బిగించింది. దేశ యువత ఈ వ్యసనాల బారిన పడి ఆర్థికంగా మరియు మానసిక ఇబ్బందులకు గురికాకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. తాజాగా జనవరి 16వ తేదీన ఒక్కరోజే దేశవ్యాప్తంగా 242 చట్టవిరుద్ధమైన వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనితో ఇప్పటివరకు దేశంలో నిషేధించబడిన బెట్టింగ్ సైట్ల సంఖ్య సుమారు 7,800 నుంచి 8,000కు చేరుకుంది.
ఈ చర్యల వెనుక ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025 (Online Gaming Act 2025) కీలక పాత్ర పోషిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం.. నగదు ప్రమేయం ఉన్న అన్ని రకాల ఆన్లైన్ గేమ్స్ మరియు బెట్టింగ్ ప్లాట్ఫామ్లను ప్రభుత్వం చట్టవిరుద్ధంగా పరిగణిస్తోంది. అవి నైపుణ్యంతో కూడిన ఆటలైనా (Games of Skill) లేదా అదృష్టంపై ఆధారపడే ఆటలైనా (Games of Chance), ఒకవేళ నగదుతో పందాలు కాస్తే అవి నిషేధాజ్ఞల కిందకు వస్తాయి. ఈ నిబంధనలను అతిక్రమించే సంస్థల నిర్వాహకులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ. 1 కోటి వరకు జరిమానా విధించే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది.
ప్రభుత్వం కేవలం వెబ్సైట్లను బ్లాక్ చేయడమే కాకుండా, ఈ ప్లాట్ఫామ్లను ప్రచారం చేసే అడ్వర్టైజర్లు మరియు ప్రమోటర్లపై కూడా నిఘా ఉంచింది. అయితే, ప్రస్తుతానికి ఈ గేమ్స్ ఆడే ప్లేయర్స్పై ఎలాంటి జరిమానాలు ఉండవని, కేవలం నిర్వహకులపైనే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, విద్య మరియు సామాజిక స్పృహను పెంపొందించే ఈ-స్పోర్ట్స్ (E-Sports) మరియు ఎడ్యుకేషనల్ గేమ్స్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వీటిని పర్యవేక్షించేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక అథారిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు.









