దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్-వేరియంట్ ఎక్స్బీబీ.1.16 ( XBB.1.16) లేదా ఆర్ట్కురుస్ (Arcturus) కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఈ ఉప వేరియంట్కు చెందిన కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 44, శనివారం 14 చొప్పున కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 144 యాక్టివ్ కేసులుండగా.. పది మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విజయవాడ జీజీహెచ్లో చేరిన బాధితుల్లో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ప్రధానంగా కన్పిస్తున్నాయి.
జ్వరం రెండు రోజుల్లో తగ్గుముఖం పట్టిన తర్వాత దగ్గు, జలుబు వస్తుంది. చిన్న పిల్లలకు దగ్గు, జలుబుతో పాటు కంటి పుసులు కట్టడం, ఎరుపుదనం కనిపిస్తోంది. దీనికి కారణాలను నిర్ధరించేందుకు సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. గతంలో మాదిరిగా గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు పెద్దగా ఉండటం లేదని పేర్కొన్నారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం సూచనలతో ఏపీలోనూ కోవిడ్ పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి.









