AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘బండి సంజయ్‌ అరెస్టు ఎందుకో తెలియదా?’..

డీజీపీపై కిషన్‌రెడ్డి ఫైర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ కేంద్రమంత్రి, భాజపా సీనియర్ నేత కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్‌ చేశారు. కారణాలు చూపకుండా సంజయ్‌ను ఎలా అరెస్టు చేస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసు వివరాలు కాసేపటి తర్వాత తెలియజేస్తామని డీజీపీ సమాధానం ఇచ్చారు. దీంతో డీజీపీపై కిషన్ రెడ్డి ఫైరయ్యారు. సంజయ్ అరెస్టు విషయంలో ఇంత హంగామా జరుగుతున్నా.. ఏ కేసులో అయన్ను అరెస్టు చేశారో తెలియదా? అని డీజీపీకి ప్రశ్నించారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరుకు ఇది నిదర్శనమన్నారు. సంజయ్ విషయంలో డీజీపీ వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు.

మరోవైపు బండి సంజయ్‌ కుమార్‌ అరెస్టుపై తెలంగాణ హైకోర్టులో బీజేపీ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సాంరెడ్డి సురేందర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు సమయంలో పాటించాల్సిన కనీస నిబంధనలు పోలీసులు పాటించలేదన్నారు. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు ,పార్టీ సభ్యులకు పోలీసులు వెల్లడించలేదన్నారు. సీఆర్పిసీ 50 కింద అరెస్టు విషయాన్ని తప్పనిసరిగా కుటుంబ సభ్యులకి చెప్పాలన్నారు. పిటిషన్‌లో మెుత్తం ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చారు. హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ రాచకొండ సీపీలు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చారు.

గత అర్ధరాత్రి కరీంనగర్‌లో సంజయ్‌ను అరెస్టు చేయగా.. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉదయం బొమ్మలరామారం పీఎస్ నుంచి సంజయ్‌ను హనుమకొండకు తీసుకెళ్లారు. తాజాగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను హనుమకొండ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10