AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఐడీ చేతికి కిడ్నీ రాకెట్‌ కేసు..

హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌ అలకనంద ఆసుపత్రి కేంద్రంగా బయటపడ్డ కిడ్నీ రాకెట్‌ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కేసులో లోతైన దర్యాప్తు జరపాలని నిర్ణయించింది. దీంతో కిడ్నీ రాకెట్‌ కేసును CIDకి అప్పగించాలని మంత్రి దామోదర రాజనరసింహా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్న మంత్రి.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు.

 

మరోవైపు ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టారు పోలీసులు. ఈ కేసులో ఆసుపత్రి ఛైర్మన్‌ సుమంత్‌, మరో వ్యక్తి గోపి సహా 8 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. సుమంత్, గోపీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

 

అలకనంద హాస్పిటల్‌లో గతంలోనూ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్టు దర్యాప్తులో తేలింది. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేసేందుకు కనీసం 15 నుంచి 20 మంది డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అవసరమవుతారు. చికిత్స కోసం డాక్టర్లతోపాటు ఆపరేషన్‌కు ముందు, తర్వాత ICU, ఆపరేషన్‌ థియేటర్‌లో నర్సులు, టెక్నీషియన్లు ఉండాలి. అయితే, కిడ్నీ రాకెట్‌లో ఇంత మంది ఎక్కడి నుంచి వస్తున్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.

 

ఇదిలా ఉంటే.. సరూర్‌ నగర్‌ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కింగ్ పిన్ డాక్టర్ లోకేష్‌ను అరెస్ట్ చేశారు. యజమాని సుమంత్, వైద్యులు సహా బ్రోకర్స్ కలిపి మొత్తం 10 మందికి పైగానే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలకనందలో ఆరు నెలలుగా అక్రమంగా కిడ్నీ ట్రన్స్‌ఫ్లాంటేషన్ ఆపరేషన్స్ జరుగుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆసుపత్రి యజమాని సుమంత్‌.. ఉజ్బెకిస్తాన్ MBBS సర్టిఫికెట్‌తో క్లినిక్ అనుమతి పొందినట్టు గుర్తించారు. ఈ ఆసుపత్రిలో నెప్రాలజీ ట్రీట్మెంట్‌కు ఎలాంటి అనుమతిలేదని దర్యాప్తులో తేలింది. 9 బెడ్స్, క్లినిక్ పర్మిషన్స్ తీసుకుని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా రన్‌ చేస్తున్నాడు సుమంత్‌. DMHO ఇప్పటికే హాస్పిటల్‌ను సీజ్ చేశారు.

 

ఇప్పటి వరకు పోలీసుల అదుపులో 8 మంది బ్రోకర్స్ ఉండగా.. తాజాగా యజమాని సుమంత్‌ సహా డాక్టర్స్‌ పవన్, మద్యవర్తి ప్రధీప్ అరెస్ట్ అయ్యారు. తమిళనాడుకు చెందిన నస్రీం భాను, ఫిర్ధోస్‌లను కిడ్నీ డోనర్స్‌గా.. బెంగళూరుకు చెందిన రాజశేఖర్, బట్టుప్రభకు వైద్యులు కిడ్నీలు అమర్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఒక్కో ఆపరేషన్‌కు హాస్పటల్ 55 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసింది. నలుగురు పేషెంట్స్ గాంధీలో చికిత్స పొందినట్టు పోలీసులు తెలిపారు. నేడు కేసు వివరాలతో మీడియా ముందుకు నిందితులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది

ANN TOP 10