AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విప్లవాత్మక సంస్కరణలకు ఆధ్యుడు.. భారత రత్న ఇచ్చి తీరాల్సిందే..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

మన్మోహన్‌ సింగ్‌ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. గొప్ప ఆలోచనకు అరుదైన సందర్భం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని చెప్పారు. మన్మోహన్‌ సింగ్‌ హాయాంలోనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కేంద్రంలో ఓబీసీ శాఖను ఏర్పాటు చేయాలని మన్మోహన్‌ సింగ్‌ను కేసీఆర్‌ కోరారని గుర్తుచేశారు. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సభ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘దివంగత మాజీ ప్రధాని మాన్మోహన్‌ సింగ్‌కు నివాళులర్పించే సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి బీఆర్‌ఎస్‌ తరఫున పూర్తిగా మద్దతిస్తున్నాం. మన్మోహన్‌ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదనతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాం.

గొప్పదనాన్ని, సామర్థ్యాన్ని గుర్తించింది పీవీయే..
మన్మోహన్‌ సింగ్‌ గొప్పదనాన్ని, సామర్థ్యాన్ని మొదటిసారిగా గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహా రావు అనేది నిర్వివాదాంశం. పీవీ నరసింహా రావు దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత లాటరీ ఎంట్రీ ద్వారా రాజకీయాలతో సంబంధ లేని ఒక ఆర్థిక వేత్తను ఫైనాన్స్‌
మినిస్టర్‌గా నియమించారు. 1991లో బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ‘ప్రపంచం మొత్తం వినాల్సిన సమయం వచ్చింది. నా దేశం మేల్కొని ఉంది..’ అంటూ ఆర్థిక వేత్తగా సంస్కరణలను ప్రవేశపెట్టే సందర్భంగా మాట్లాడారు. ఆ మాటలు.. ఆయన సిద్దాంతం, పీవీ నరసింహారావు నాయకత్వం నేడు దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కేవలం 15 రోజులు ఫారెక్స్‌ నిల్వలు ఉన్న నాటి రోజు నుంచి ప్రపంచమంతా ఆశ్యపడే స్థాయికి దేశాన్ని పరుగెత్తించిన ఆర్థిక సంస్కరణల శీలి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌. అనవసరపు డాంభికాలు, ఆర్భాటాలు, హడావుడి లేకుండా సింపుల్‌ లివింగ్‌.. హై థింకింగ్‌ అనే మాటకు పర్యాయపదంగా మన్మోహన్‌ సింగ్‌ను మనం చెప్పుకోవచ్చు. విశ్వాసం అనే నేటి రాజకీయాల్లో అరుదైన పదం. తనకు అండగా నిలబడిన కాంగ్రెస్‌ పార్టీకి జీవితాంతం సేవలందించిన మహానుభావుడు. ఆర్థికమంత్రిగా, తర్వాత ప్రధానిగా పనిచేసి, ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన అభ్యుదయ వాది, నిరాడంబర మనిషి మన్మోహన్‌ సింగ్‌.

విప్లవాత్మక సంస్కరణలు..
ఎన్నో అడ్డంకులు, ఎన్నో అభ్యంతరాలున్నా మన్మోహన్‌ సింగ్‌ ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడ్డారు. ఎన్నడూ కూడా, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా సంస్కరణల బాట నుంచి వెనక్కి తగ్గలేదు. ఆయన్ని మనం సైలెంట్‌ ఆర్కిటెక్ట్‌ ఆఫ్‌ మోడ్రన్‌ ఇండియా అని పిలువవచ్చు. మన్మోహన్‌ కాదు ఈయన మౌన మోహన్‌ సింగ్‌ అని, మౌన ముని అని పేర్లు పెట్టారు. అయితే అవేవీ పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోయారు. విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అవమానం చేస్తే ఆకాశం స్థాయి తగ్గదు. ఎన్ని నిందలు వేసిన మహోన్నతులు వణకరు, బెనకరు. అలాంటి స్థితప్రజ్ఞతను మనం మన్మోహన్‌ సింగ్‌లో చూశాం. సీఎం ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణ తెలుపుతున్నాం. ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలుపుతున్నాం’ అని కేటీఆర్‌ అన్నారు.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10