AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల అరెస్ట్‌.. స్టేట్‌ పాలిటిక్స్‌ లో మరో కీలక పరిణామం

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి సైతం నోటీసులు
అక్రమ  అరెస్టులకు భయపడం: కేటీఆర్‌

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్‌ అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ లోని వెస్ట్‌ మారేడ్‌పల్లిలో ఎర్రోళ్ల ఇంటికి వెళ్లిన జూబ్లీ హిల్స్‌ పోలీసులు ఆయనను అదుపులోకి మాసబ్‌ ట్యాంక్‌ పీఎస్‌కు తరలించారు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో పోలీసుల విధులకు ఆటంకం కలించారని ఆయనపై ఇటీవలే కేసు నమోదైంది. అదేవిధంగా ఇదే వ్యవహారంలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం విచారణకు రావాల్సిందిగా కౌశిక్‌కు పోలీసులు నోటీసులు జారీచేశారు… ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కూడా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. అయితే.. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అనంతరం నోటీసులు ఇచ్చి.. వెంటనే అరెస్ట్‌ చేశారు. మాసబ్‌ట్యాంక్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఆయనను తరలించారు.

కేటీఆర్‌ ఫైర్‌..
తాజాగా.. బీఆర్‌ఎస్‌ నేతను అరెస్ట్‌ చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, ఇది దుర్మార్గమని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే తమపై కక్ష గట్టి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఏమో కానీ.. ఏడో గ్యారంటీగా రాష్ట్రంలో ‘ఎమర్జెన్సీ’ని ముఖ్యమంత్రి రేవంత్‌ అమలు చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. నిర్బంధాలు, అణచివేతలతో గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమ అరెస్ట్‌లతో భయపడే ప్రసక్తేలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10