కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదికి ఆదేశాలు
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ప్రస్తుత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. పార్టీ ఆఫీస్ ల కోసం చౌకగా భూమి కేటాయించారని అప్పటి సీఎం కేసీఆర్ ను ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో తక్కువ ధరకు భూములు కేటాయించారని పిటిషనర్ వాదించారు.
గజం రూ. 100 చొప్పున ..
రూ.500 కోట్ల విలువైన భూమిని రూ.5 కోట్లకు కేటాయించారని, గజం రూ.100 చొప్పున కేటాయింపు జరిపినట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాక ప్రతివాదిగా ఉన్న కేసీఆర్ 2022 నుంచి ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదని హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో జర్నలిస్టులు, అధికారులకు భూ కేటాయింపులపై సుప్రీంకోర్టు గత నెల 25న ఇచ్చిన తీర్పును పిటిషనర్ కోట్ చేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఈ పిటిషన్ లో ప్రతివాదిగా ఉన్న మాజీ కేసీఆర్ తో పాటు ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు మూడు వారాల సమయం ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.