AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గౌతమ్ అదానీకి మరో షాక్.. రూ.62 వేల కోట్ల ఒప్పందాలు రద్దు చేసిన కెన్యా

ఇప్పటికే అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదు కావడం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అదానీ గ్రూప్‌తో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటున్నట్లు కెన్యా ప్రభుత్వం వెల్లడించింది. లంచం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్‌ అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో కెన్యా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్‌తో ఎయిర్‌పోర్ట్‌ కాంట్రాక్ట్‌తోపాటు విద్యుత్‌ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు తాజాగా కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం వెల్లడించారు.

కెన్యాలో విద్యుత్‌ సరఫరా లైన్ల నిర్మాణానికి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూప్‌తో కెన్యా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా 30 ఏళ్ల కాలానికి 736 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ.62 వేల కోట్లకు పైగా అదానీ గ్రూపుతో కెన్యా సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు.. కెన్యాలోని కీలక ఎయిర్‌పోర్టు అయిన జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కూడా అదానీ గ్రూపు చేతి నుంచి జారిపోయింది. ఈ ఎయిర్‌పోర్టును గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌కు అప్పగించేందుకు కెన్యా సర్కార్ రంగం సిద్ధం చేయగా.. అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అదానీకి అప్పగించడంపై స్థానికంగా తీవ్ర నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను అదానీకి అప్పగించడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ కెన్యా ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. తాజాగా అమెరికాలో అదానీపై కేసు నేపథ్యంలో ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. భాగస్వామ్య దేశాల దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెన్యా సర్కార్ విలియం రూటో తెలిపారు. ఈ నేపథ్యంలోనే రవాణా, ఇంధన మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.

ANN TOP 10